
పాలకొండ: ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేన టీమ్ మానవత్వాన్ని చాటుతూ ఆపదలో ఉన్న ఓ కుటుంబానికి ఆర్థిక సాయం అందించింది. వీరఘట్టం పట్టణంలోని లంకవీధికి చెందిన తోత్తరపూడి ధనలక్ష్మి గర్భసంచి క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న వీరఘట్టం టౌన్ జనసేన నాయకుడు సరిపల్లి అచ్యుతరావు, జనసేన బృందం, స్నేహితులు పార్టీలకు అతీతంగా స్పందించి తమవంతుగా విరాళాలు సేకరించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ కమిటీ సభ్యుడు జానీ మత్స పుండరీకం, సరిపల్లి అచ్యుతరావు, కర్నెన సాయి పవన్, ఉదయాన చరణ్, నందివాడ పండు, సొండి సుమన్, అమల, పుప్పాల పురుషోత్తం, పడాల సాయినాథ్, పడాల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జానీ మాట్లాడుతూ, బాధితురాలి పరిస్థితిని సరిపల్లి అచ్యుతరావు స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. అలాగే భవిష్యత్తులో కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా నేరుగా తనను సంప్రదించాలని, తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే చూపిన సహకారానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.