
పూతలపట్టు: కాణిపాకంలో పూతలపట్టు నియోజకవర్గ జనసేన నాయకుల సమావేశం గుర్రం రఘురాం చౌదరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి కార్యకర్తకు వివిధ స్థాయిల్లో నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం కల్పించేందుకు పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో దరఖాస్తులు ఆహ్వానించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.
గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు త్వరలోనే పార్టీ కమిటీలను ప్రకటించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న కార్యకర్తలకు వారి అర్హతలు, సేవా దృక్పథం, పార్టీ పట్ల నిబద్ధత ఆధారంగా బాధ్యతలు కేటాయిస్తారని వెల్లడించారు.
కొత్త కమిటీల్లో ఎవరికి అవకాశం వచ్చినా వ్యక్తిగత ఆశయాల కంటే పార్టీ బలోపేతానికే ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమన్వయంతో ముందుకు సాగితేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో గుర్రం రఘురాం చౌదరి, ఏపీ శివయ్య, పూల ప్రభాకర్, కే. పురుషోత్తం, కుమార్, ఉదయ్ కుమార్, ఆవుల శాంతమూర్తి, కే. మోహన్ బాబు, నానబాల లోకేష్ రాయల్, ప్రభాకర్, కుమారస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.