
నార్పల ప్రాంతంలోని హిందూ–ముస్లిం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుల్లాయి స్వామి, ఆంజనేయస్వామి జంట ఆలయాలను జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కుల, మత భేదాలకు అతీతంగా ప్రజలందరూ ఒకే వేదికపై భక్తితో పూజించే ఇలాంటి పవిత్ర క్షేత్రాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలో ఐక్యత, సామరస్యం, పరస్పర గౌరవ భావాలను పెంపొందించే ఆలయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
గూగూడు జంట స్వాముల అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుభిక్షం కలగాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివార్లను ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు.