
రాజోలు: గుడిమెల్లంక సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం ద్వారా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం, సఖినేటిపల్లి, రాజోలు, మామిడికుదురు మండలాల పరిధిలోని 30 గ్రామపంచాయతీలకు చెందిన 98 ఆవాసాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ఇటీవల ఈ పథకంలోని రెండు 70 హెచ్పీ మోటార్లు కాలిపోవడంతో కొన్ని గ్రామాల్లో నీటి సరఫరాకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో తాగునీటి సరఫరా నిలిచిపోకుండా తాత్కాలికంగా 35 హెచ్పీ మోటారును ఏర్పాటు చేసి నీటి సరఫరా కొనసాగించారు. అనంతరం కాలిపోయిన రెండు మోటార్లకు మరమ్మతులు పూర్తి చేసి సోమవారం తిరిగి బిగించారు.
రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి నాయకుల సమన్వయంతో ఈ పనులు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోటార్ల మరమ్మతులు పూర్తికావడంతో ఆయా గ్రామాలకు తాగునీటి సరఫరా యథావిధిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా అవసరమైన చర్యలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.