
శ్రీకాకుళం: మందస మేజర్ పంచాయతీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా రహదారులను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పండా మందస తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సమస్యపై ఇప్పటికే రెండుసార్లు అధికారులకు వినతిపత్రాలు అందించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే మూడోసారి అధికారుల దృష్టికి తీసుకువస్తున్నామని తెలిపారు. రహదారులపై అక్రమ నిర్మాణాల వల్ల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్పందించి ఆక్రమణలను తొలగించాలని కోరారు.
అక్రమ కట్టడాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని జనసేన నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్టీ సెల్ నాయకులు, మందస మండల ఉపాధ్యక్షులు సవర శివ, మందస టౌన్ నాయకులు, ఎస్సీ సెల్ మండల నాయకులు బమ్మిడి మహేష్, సత్య స్వరూప్ పట్నాయక్, కిరణ్ పండా, శ్రీనివాస్ మహంతి, శ్రీకాంత్ బెహరా తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.