
- రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం
- పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
- శిథిలావస్థకు చేరిన ఆలయ పునరుద్ధరణకు హామీ
- పర్యటన ముగిసిన వెంటనే టీటీడీకీ లేఖ… స్పందించిన పాలక మండలి
- శివాలయంతోపాటు అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాల ఏర్పాటుకి నిధులు మంజూరు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గంలోని వర్తనపల్లి గ్రామంలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణం కానుంది. ఆయన విన్నపం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.55 లక్షల నిధులను మంజూరు చేసింది.
మార్చి 14న పాడేరు పర్యటనలో భాగంగా గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్, స్థానికుల అభ్యర్థనపై శివాలయాన్ని దర్శించారు. ఆలయం దెబ్బతిన్న పరిస్థితిని గమనించిన ఆయన, పునర్నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పర్యటన అనంతరం వెంటనే టీటీడీకి లేఖ రాసి, భక్తుల ఆకాంక్షలను వివరించారు.
దీంతో స్పందించిన టీటీడీ సాంకేతిక బృందం గ్రామాన్ని సందర్శించి అంచనాలు రూపొందించింది. శివాలయం పునర్నిర్మాణంతో పాటు అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాల ఏర్పాటు, ధ్వజస్తంభం నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే భక్తులకు సౌకర్యంగా బెంచీలు, తాగునీటి బోర్వెల్, మైక్ సిస్టమ్ వంటి సదుపాయాలు కూడా కల్పించనున్నారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, పాలక మండలి సభ్యులు, అధికారులు అందరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.