
- ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు
ఏలూరు: రాజకీయ దిగ్గజ నేత నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటుగా మారిందని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ మరియు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తండ్రి భాస్కరరావు మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు.
ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య వంటి ప్రముఖ నేతలతో కలిసి పనిచేసిన భాస్కరరావు రాజకీయ రంగంలో సంచలనాత్మక మార్పులకు దారి తీశారని గుర్తుచేశారు. ఆయన రాజకీయ జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
అనేక మంది నాయకులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి, వారికి మార్గనిర్దేశం చేసిన వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ సందర్భంగా దివంగత భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి ఈ దుఃఖ సమయంలో ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.