
మార్కాపురం జిల్లాలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లాలోని నీటిపారుదల శాఖ, ఉపాధి హామీ అధికారులు, అన్ని మండల ఎంపీడీవోలతో జలధార–జలహారతి కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే 100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో చేపట్టబోయే పనులపై రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే జంగిల్ క్లియరెన్స్, పూడికతీత పనులు చేపట్టి నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని ప్రణాళిక బద్ధంగా పనులు చేపడితే కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, వెలుగొండ ప్రాజెక్టు ఎస్ఈ అబూతలిం, నీటిపారుదల శాఖ ఈఈ భాస్కర్ రెడ్డి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ సురేష్ బాబు తదితర అధికారులు పాల్గొన్నారు.