
మార్కాపురం: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం సానికవరం గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్ బి. ఆదినారాయణ అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకున్నారు. ఫ్రాన్స్లోని టూలూజ్ నగరంలో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన 17వ ప్రపంచ రవాణా పరిశోధన సదస్సు (డబ్ల్యూసీటీఆర్–2026)లో భారతదేశం తరఫున పరిశోధన పత్రాన్ని సమర్పించి అంతర్జాతీయ శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకున్నారు.
ప్రస్తుతం చండీగఢ్లోని పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాల (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఆదినారాయణ, గ్రామీణ, గిరిజన, కొండ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే అంశంపై పరిశోధన నిర్వహించారు.
జీఐఎస్, ఏహెచ్పీ సాంకేతిక విధానాల ఆధారంగా రూపొందించిన ఆయన పరిశోధన గ్రామీణ రవాణా ప్రణాళికకు కొత్త దిశను చూపుతుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి హాజరైన శాస్త్రవేత్తలు, పరిశోధకుల సమక్షంలో తన పరిశోధన ఫలితాలను వివరించిన డాక్టర్ ఆదినారాయణ, సమాజానికి ఉపయోగపడే పరిశోధనలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తానని తెలిపారు.
మార్కాపురానికి చెందిన యువ శాస్త్రవేత్త అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల జిల్లావాసులు, విద్యావేత్తలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.