
రాజమహేంద్రవరం: సాటిలైట్ సిటీలో వైభవంగా జరుగుతున్న శ్రీ గురజాల అక్కమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి, శేషవస్త్రం, తీర్థప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్రం అభివృద్ధి, ప్రగతి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గ్రామీణ జాతరలు, సంస్కృతి, సంప్రదాయాలు మన వారసత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. వాటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి, సుభిక్షం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.