
కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీ, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఘటనకు సంబంధించిన వివరాలను వారికి వివరించారు.
సాయికృష్ణ అదృశ్యమైన పరిస్థితులు, ఘటన క్రమంపై పవన్ కళ్యాణ్ సమగ్రంగా ఆరా తీశారు. కేసులోని వాస్తవాలను పూర్తిస్థాయిలో వెలికితీసి ప్రజలకు నిజాలు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఘటనపై సీనియర్ అధికారి నేతృత్వంలో స్వతంత్ర విచారణ చేపట్టాలని సూచించారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించగా, సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కేసు దర్యాప్తును సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపి పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.