
నరసాపురం నియజకవర్గం: నరసాపురం పట్టణంలోని వీవర్స్ కాలనీలో ఉన్న మున్సిపల్ ప్రైమరీ స్కూల్కు పూర్వ విద్యార్థులు సొంత ఖర్చులతో రంగులు వేయించి తమ పాఠశాల పట్ల ఉన్న అభిమానం, బాధ్యతను చాటుకున్నారు. పాఠశాల అభివృద్ధికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేపట్టిన ఈ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పాల్గొని పూర్వ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. తాము చదివిన పాఠశాల అభివృద్ధికి సహకారం అందించడం ద్వారా సమాజానికి, ప్రస్తుత విద్యార్థులకు మంచి సందేశం ఇస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. విద్యా రంగ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, జనసేన, టిడిపి, బిజేపి నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.