ఎమ్.టీవీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం: ఎమ్మెల్యే చంటి

ఏలూరు : ఎమ్.టీవీ స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సామాజిక సేవలో భాగంగా ఏలూరులో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు.

మంగళవారం ఏలూరు ఎన్.ఆర్.పేటలోని మోర్ సూపర్ మార్కెట్ సమీపంలో ఎమ్.టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ మరియు జనసేన ఇన్‌చార్జి రెడ్డి అప్పల నాయుడు, నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ కిషోర్, ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తదితరులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్.టీవీ చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ కాగిత మాణిక్యాలరావు మాట్లాడుతూ మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి స్ఫూర్తితో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ ఎమ్.టీవీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ప్రముఖుల చేతుల మీదుగా చల్లని పానీయాల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్.టీవీ డిజిటల్ ఛానల్ మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలనే తపనతో మీడియా సంస్థలు కూడా ముందుకు రావడం అభినందనీయమన్నారు. తీవ్ర ఎండల సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఏలూరులో కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు వీరంకి పండు, టిడిపి నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.