
విజయనగరం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం ఘన విజయాన్ని సాధించి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరంలో మెగా అభిమానులు వైభవంగా విజయోత్సవాలు నిర్వహించారు. జిల్లా చిరంజీవి యువత, రామ్ చరణ్ యువశక్తి, మెగా యూత్ ఫోర్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఎన్సీఎస్ థియేటర్ వద్ద గురువారం ఉదయం ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు గురాన అయ్యలు, రాధిక దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. థియేటర్కు చేరుకున్న అతిథులకు, అభిమానులకు బాణాసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. అభిమానుల హర్షధ్వానాల మధ్య గురాన అయ్యలు దంపతులు ప్రత్యేక కేక్ కట్ చేసి చిత్ర విజయాన్ని పురస్కరించుకుని సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ, ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘన విజయం మెగా అభిమానుల్లో అపారమైన ఉత్సాహాన్ని నింపిందన్నారు. అనంతరం 50 రోజుల పాటు చిత్రాన్ని విజయవంతంగా ప్రదర్శించిన ఎన్సీఎస్ థియేటర్ సిబ్బందిని అభిమాన సంఘాల నాయకులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులు, ప్రజలకు పెద్ద ఎత్తున స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ వేడుకల్లో జిల్లా చిరంజీవి యువత, రామ్ చరణ్ యువశక్తి, మెగా యూత్ ఫోర్స్ నాయకులు, ప్రతినిధులు, మెగా అభిమానులు, జనసేన శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని థియేటర్ పరిసరాలను పండుగ వాతావరణంగా మార్చేశారు.