
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ బుధవారం విజయవాడలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, వైద్య సేవల విస్తరణ, ప్రజారోగ్య కార్యక్రమాల అమలు వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
అలాగే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి, ప్రజలకు అవసరమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వ సహకారం అందించాలని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కోరారు.
ప్రజల సంక్షేమం, ఆరోగ్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, నరసాపురం నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి సత్య కుమార్ యాదవ్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.