
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురంలోని ఎన్.ఎస్ వ్యవసాయ కళాశాల, ఎన్.ఎస్ ఉద్యాన కళాశాల, ఎన్.ఎస్ లా కళాశాల, ఎన్.ఎస్ ఫార్మసీ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల అసోసియేట్ డీన్ డా. ఆర్విఎస్కే రెడ్డి మాట్లాడుతూ యోగం వేదకాలం నుంచి భారతీయ సంస్కృతిలో అంతర్భాగంగా కొనసాగుతోందని తెలిపారు. యోగ సాధన ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ కనీసం ఒక గంట సమయాన్ని యోగాకు కేటాయించి, దానిని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.
కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్. బ్రహ్మరెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, ప్రశాంతతను పెంపొందించడంలో యోగ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరచుకోవచ్చని అన్నారు.
కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగాసనాలను అభ్యసించారు. కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కే. సురేష్ యోగ గురువుగా వ్యవహరించి విద్యార్థులకు యోగాసనాలపై శిక్షణ అందించి మార్గనిర్దేశనం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు.