ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత: ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

‘మీ కోసం’ కార్యక్రమంలో 78 ఫిర్యాదులు స్వీకరణ – అధికారులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలు

ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)’ కార్యక్రమంలో మొత్తం 78 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల వినతులను స్వయంగా స్వీకరించిన ఎస్పీ, వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు పంపించి వెంటనే విచారణ చేపట్టి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా వ్యవహరించాలని, ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రతి ఒక్కరిలో పోలీసు శాఖపై మరింత విశ్వాసం పెరిగేలా స్పందించాలని పేర్కొన్నారు.

ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్న ఫిర్యాదుదారుల పట్ల సున్నితంగా వ్యవహరించి, వారి వినతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ వివాదాలు, సివిల్ తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, మోసాలు, అత్తింటి వేధింపులు వంటి అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హాజరత్తయ్య, కందుకూరు సీఐ అన్వర్ బాషా, అద్దంకి అర్బన్ సీఐ సుబ్బరాజు, ప్యానెల్ అడ్వొకేట్ బి. బాలాజీ సింగ్, ఎస్సై జనార్దన్ రావు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.