
మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ప్రజల సమస్యలను వినడం, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడం పోలీసుల ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. మొత్తం 32 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిశీలించి నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదుల్లో సివిల్ వివాదాలు, భూ తగాదాలు, ఆర్థిక మోసాలు, అత్తింటి వేధింపులు వంటి అంశాలు అధికంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. బాధితులు జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని పరిస్థితుల్లో సమీప పోలీస్ స్టేషన్లు, సర్కిల్, సబ్-డివిజన్ కార్యాలయాల ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్, పొదిలి సీఐ రాజేష్ కుమార్, కంభం సీఐ మల్లికార్జున రావు తదితర అధికారులు పాల్గొన్నారు.