
స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
అమలాపురం, జూన్ 30: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాల జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచారం సేకరణ కమిటీ సభ్యులతో అమలాపురం పార్లమెంట్ పరిశీలకులు, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేయడంలో ప్రతి జనసైనికుడు, కార్యకర్త కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేసేందుకు భవిష్యత్ కార్యాచరణ, చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే ప్రతి స్థానంలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహాన్ని స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగించాలని, కూటమి భాగస్వామ్య పార్టీలతో సమన్వయం చేసుకుని అధిక స్థానాలు గెలుచుకునేలా కృషి చేయాలని కోరారు.
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉన్నందున మరింత మంది నాయకులకు బాధ్యతలు చేపట్టే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రజల కోసమే జనసేన పార్టీ పనిచేస్తోందనే సందేశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతమే భవిష్యత్ ఎన్నికల్లో విజయానికి పునాది అవుతుందని అన్నారు.
పెందుర్తి నియోజకవర్గంలో 2,500 మంది సభ్యులతో పార్టీని బలోపేతం చేసి బలమైన శక్తిగా తీర్చిదిద్దామని పేర్కొన్న ఆయన, పార్టీ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం విజయవంతం కావడానికి జనసేన శ్రేణుల కృషే కారణమని అభినందించారు.
అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల నుంచి నిర్మాణ సారథుల సమాచారం సేకరణ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో మండపేట నియోజకవర్గ ఇన్చార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, రామచంద్రపురం నియోజకవర్గ ఇన్చార్జ్ చంద్రశేఖర్, సమాచారం సేకరణ కమిటీ సభ్యులు, రెండు నియోజకవర్గాల జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.