
జనసేనలో అవకాశం కష్టానికే.. ప్రజాసేవే నాయకత్వానికి ప్రమాణం: పందిటి మల్హోత్రా
మైదుకూరు, జూన్ 30: జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని మైదుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పందిటి మల్హోత్రా పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసం అంకితభావంతో కష్టపడుతున్న ప్రతి జనసైనికుడు, వీర మహిళ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా కులం, డబ్బు, పరిచయాల ఆధారంగా కాకుండా, జనసేనలో ప్రజాసేవ, నిబద్ధత, కష్టపడి పనిచేసే కార్యకర్తలకే అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
2014లో పార్టీ ఆవిర్భావం నుంచి నిరంతరం సేవలందిస్తున్న ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మైదుకూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి మండలం నుంచి కార్యకర్తలు, వీర మహిళలు, యువత తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. కార్యకర్తల సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం, ప్రజా సమస్యలపై స్పందన వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి రాష్ట్ర నాయకత్వానికి నివేదిక పంపిస్తామని, భవిష్యత్తులో అర్హత, సేవాభావం ఉన్న వారికి పార్టీ బాధ్యతలు కల్పించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని వివరించారు.
“జనసేనలో అవకాశం వారసత్వానికి కాదు… కష్టానికి. పదవి పరిచయాలకు కాదు… ప్రజాసేవకు.” అనే సిద్ధాంతంతో పార్టీ ముందుకు సాగుతోందని పందిటి మల్హోత్రా స్పష్టం చేశారు.