
ఎన్యూమరేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం వీడి వేగంగా పని చేయాలి: కలెక్టర్ విజయ సునీత
త్రిపురాంతకం, జూన్ 30: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.
మంగళవారం త్రిపురాంతకం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఐదు మండలాల వారీగా ఎన్యూమరేషన్ పురోగతిని సమీక్షించిన కలెక్టర్, పనితీరు సంతృప్తికరంగా లేని బీఎల్వోలను మందలించారు. డిజిటలైజేషన్ ప్రక్రియను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నిస్తూ, సమయం తక్కువగా ఉన్నందున పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఇప్పటికైనా విధానాన్ని మార్చుకుని పూర్తి బాధ్యతతో పనిచేసి ఎన్యూమరేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో జిల్లాను రాష్ట్రంలో ముందువరుసలో నిలిపేందుకు ప్రతి ఉద్యోగి సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో మార్కాపురం ఆర్డీవో ఎం. వెంకట శివరామిరెడ్డి, ఎస్డీసీ సత్యనారాయణ, నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.