
మార్కాపురం: పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. అధికారులు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు), సంబంధిత సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేసి ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
ఆదివారం మార్కాపురం పట్టణంలోని తూర్పువీధి, రాఘవేంద్రస్వామి ఆలయ పరిసరాలు, భగత్సింగ్ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరును తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల సందేహాలను వెంటనే నివృత్తి చేసి సంబంధిత దరఖాస్తు ఫారాలను స్వీకరించి అదే రోజు డిజిటలైజేషన్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మిగిలిపోకుండా ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం వేగంగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు.
సమయం పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ పనులను మరింత వేగవంతం చేసి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.
ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావుతో పాటు సంబంధిత అధికారులు, బీఎల్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.