
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో “సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్” సభ ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి, జనసేన పార్టీ ఇన్చార్జ్ వాల్మీకి బి. లక్ష్మన్న, బీజేపీ ఇన్చార్జ్ ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు ఆది గుడిసె కృష్ణమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు అశోక్ రెడ్డి అధ్యక్షత వహించారు.
సభలో జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జ్ వాల్మీకి బి. లక్ష్మన్న మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే ఉత్తమ శాఖగా గుర్తింపు పొందడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, వారి సమిష్టి కృషి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ దేశంలో అభివృద్ధి పథంలో ముందంజలో నిలుస్తోందని ఆయన అన్నారు.
టీడీపీ మంత్రాలయం ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా నియోజకవర్గ అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడకుండా రూ.350 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గంలో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేశామని, గత ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.
టీడీపీ యువ నాయకుడు, మంత్రాలయం సింగిల్ విండో అధ్యక్షుడు ఎన్. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కోసిగి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సిరెడ్డి, బీజేపీ నాయకుడు ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి, ఎన్. రమకాంత్ రెడ్డి, ఎన్. శశిరేఖ, చావిడి వెంకటేష్, సురేష్ నాయుడు, ఆర్. లక్ష్మయ్య, వెంకటేశులు, టీడీపీ సీనియర్ నాయకుడు బస్సులదొడ్డి ఈరన్న తదితరులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు.
జనసేన నాయకులు రామాంజనేయులు, ఎస్. చిన్న, జి. బజార్ అప్ప (అబ్రహం) కూడా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాలుగు మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సభ విజయవంతంగా నిర్వహించబడగా, ఎన్డీఏ కూటమి అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ సమావేశం కీలకంగా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.