
విజయవాడ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు జనసేన పార్టీ విజయవాడ నగర ప్రచార కమిటీ కో-ఆర్డినేటర్ తిరుపతి సురేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం, ప్రజల త్యాగాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ స్ఫూర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. అయితే కొంతమంది రాజకీయ నాయకులు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనవసర విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ను విమర్శించే విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించిన ఆయన, ఆధారరహిత ఆరోపణలు మరియు వ్యక్తిగత విమర్శలు సహించబోమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ను ఆదరిస్తున్నారని, ఆయన తెలంగాణ ఉద్యమం, పోరాట యోధుల త్యాగాలను అనేక సందర్భాల్లో ప్రశంసించారని గుర్తు చేశారు.
అలాగే తెలంగాణ ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందిస్తూ పలు సందర్భాల్లో సహకారం అందించారని పేర్కొన్నారు. ఈ విషయాలను విస్మరించి రాజకీయ దాడులు చేయడం సమంజసం కాదన్నారు.
ఈ క్రమంలో రాజకీయ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని హితవు పలికిన తిరుపతి సురేష్, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి అంశాలపై చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలతో జనసేన పార్టీకి ఎల్లప్పుడూ సానుకూల సంబంధాలు ఉన్నాయని, భవిష్యత్తులో కూడా ప్రజాహిత కార్యక్రమాల్లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.