
ర్వతిపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం తెట్టింగి గ్రామ పరిధిలోని బేవర గోపాలనాయుడు అన్నసత్రానికి సంబంధించిన సర్వే నంబర్ 289-6లో ఉన్న 4.21 ఎకరాల దేవాదాయ భూముల లీజు వ్యవహారంపై గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బహిరంగ వేలం నిర్వహించకుండా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాత కౌలుదారుడికే రహస్యంగా లీజును పొడిగించారని గ్రామస్థులు ఆరోపించారు. రెవెన్యూ మరియు దేవాదాయ శాఖ సిబ్బంది కుమ్మక్కై ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా, ఓపెన్ ఆక్షన్ నిర్వహించకుండా ఏకపక్షంగా లీజు పొడిగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
గ్రామ ప్రజల హక్కులను కాలరాస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన సిబ్బందిపై తక్షణమే విచారణ జరిపించాలని, అలాగే పారదర్శకంగా ఓపెన్ ఆక్షన్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గ్రామ తీర్మానం ప్రకారం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు.
స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు గర్భనా సత్తిబాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ ఆదేశాల మేరకు ఈ వినతిపత్రం సమర్పించినట్లు గ్రామస్థులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వండాన సత్యనారాయణ, వండాన సాయి కిరణ్, పి.జె. మోహన్ రావు, వండాన శ్యామ్, పొట్నూరు శ్రీనివాసరావు, వండాన సురేష్, పాలవలస ఉమా మహేశ్వరరావు, గెదల కన్నబాబు, వండాన దాం, వండాన సీతారామ్, వండాన ప్రసాద్, జరజాపు పద్మరాజుతో పాటు గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.