
మదనపల్లి నియోజకవర్గంలోని మదనపల్లి పట్టణంలో చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ నౌషాద్ ఆధ్వర్యంలో రామ్ చరణ్ నటిస్తున్న రాబోయే చిత్రం ‘పెద్ది’కి సంబంధించిన ముఖ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దారం అనిత మాట్లాడుతూ.. మదనపల్లిలో మెగా ఫ్యామిలీ అభిమానులు, యువత భారీ సంఖ్యలో ఉన్నారని తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలు విడుదలైనప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వేడుకలు, ప్రమోషన్లు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
మెగా అభిమానులు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారని తెలిపారు. నౌషాద్ నాయకత్వంలో ఈ టీమ్ వర్క్ మరింత ముందుకు సాగుతోందని అభినందించారు.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై బుజ్జిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా, దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు.
ఈ చిత్రం 1980ల కాలం నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూపొందుతోందని తెలిపారు. క్రికెట్, కుస్తీ క్రీడల చుట్టూ కథ సాగుతుందని, రామ్ చరణ్ ఇందులో భిన్నమైన పాత్రలో కనిపించనున్నారని చెప్పారు.
యువత తప్పక చూడాల్సిన చిత్రం
‘పెద్ది’ మంచి సందేశాత్మక చిత్రమని, యువత తప్పకుండా చూడాల్సిన సినిమా అని దారం అనిత పేర్కొన్నారు. మెగా ఫ్యామిలీ ఎప్పుడూ సమాజ సేవలో ముందుంటుందని, ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించాలని పిలుపునిచ్చారు.