

* అభినందించిన శ్రీ పవన్ కళ్యాణ్
రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాలను క్రమం తప్పకుండా సేకరించి, వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తూ పర్యావరణ పరిరక్షణ సాధించాలనే లక్ష్యంతో, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి , పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో భాగంగా ప్రారంభమైన స్వచ్ఛ రథాలు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం 537 పాఠశాలల పరిధిలో విద్యార్థులు ఘన, ద్రవ వ్యర్థాలను వేరు చేసి ఘన మరియు ద్రవ వనరుల నిర్వహణ (SLRM) కు అనుగుణంగా అందించగా, ఈ కార్యక్రమంలో మొత్తం 576 స్వచ్ఛ రథాలు పాల్గొన్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి కార్యక్రమంలో భాగంగా, ఒక్క రోజులోనే దాదాపు 1 లక్ష కేజీల చెత్తను స్వచ్ఛ సారథులు సేకరించారు. సేకరించిన వ్యర్థాల ద్వారా సుమారు ₹11.96 లక్షల ఆదాయం లభించనుందని అధికారులు తెలిపారు. అనంతరం, చెత్తను అందించిన విద్యార్థులకు పంచాయతీరాజ్ అధికారులు మరియు స్వచ్ఛ సారథులు కొత్త పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.