
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై హైదరాబాద్ కేంద్రంగా కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు యర్రగోపుల జయదీప్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి ఆపద వచ్చినా కోట్లాది రూపాయల విరాళాలు అందిస్తూ, పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. అలాంటి వ్యక్తిపై కొందరు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలు, రాజకీయ అంశాలపై విమర్శలు సహజమేనని, అయితే వ్యక్తిగత దూషణలు చేయడం, ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్నదమ్ముల్లా పరస్పర గౌరవం, సోదరభావంతో కలిసి ముందుకు సాగాలని, రెండు తెలుగు రాష్ట్రాలు ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రాంతీయ విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని, సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని యర్రగోపుల జయదీప్ పిలుపునిచ్చారు.