
దేశవ్యాప్తంగా వాహనదారులకు భారీ షాక్ తగిలింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు సుమారు రూ.3 మేర పెంచినట్లు శుక్రవారం ప్రకటించాయి. ఈ కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.
ఈ పెంపుతో రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.77 నుంచి రూ.97.77కు చేరగా, డీజిల్ ధర రూ.87.67 నుంచి రూ.90.67కు పెరిగింది. ఇతర ప్రధాన నగరాల్లోనూ ధరలు గణనీయంగా పెరిగాయి. కోల్కతాలో పెట్రోల్ ధర రూ.108.74కు, ముంబైలో రూ.106.68కు, చెన్నైలో రూ.103.67కు చేరాయి. అదే విధంగా డీజిల్ ధరలు కోల్కతాలో రూ.95.13, ముంబైలో రూ.93.14, చెన్నైలో రూ.95.25గా నమోదయ్యాయి.
నగరాలను బట్టి ఈ పెంపు రూ.2.83 నుంచి రూ.3.29 వరకు ఉంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ స్థాయిలో ఇంధన ధరల సవరణ జరగడం ఇదే తొలిసారి అని భావిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 105 డాలర్లను దాటినట్లు సమాచారం. హోర్ముజ్ జలసంధి ద్వారా జరిగే ఇంధన రవాణాపై ఆందోళనలు కూడా మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి.
ఈ పరిణామాలపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ఈ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు.
ఇక బ్రెంట్ క్రూడ్ ధర 105 డాలర్లు దాటితే మే 15 తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉందని ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ మనోరంజన్ శర్మ ముందుగానే అంచనా వేశారు. తాజా పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.