
మంగళగిరి : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు సాయంత్రం 5 గంటలకు పార్టీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహించనున్నారు.
ఈ సమావేశంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొని రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వ విధానాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
అలాగే పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, రాబోయే పార్టీ కార్యక్రమాలు, ప్రజల్లో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధుల పాత్ర, సమన్వయంతో ముందుకు సాగే అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.