
హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన మాటను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 24 గంటల్లోనే ఆచరణలో పెట్టారు. ఆయన ఆదేశాల మేరకు హస్తకళాకారుల కోసం క్లస్టర్ల వారీగా ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రారంభించారు.
బుధవారం నరసాపురంలోని లేస్ కళాకారులు, శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుల కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. నరసాపురంలో 105 మంది లేస్ కళాకారులకు పరీక్షలు చేయగా, 37 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. అందులో 16 మందికి శుక్లాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించగా, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. మరో 21 మందికి కళ్లజోళ్లు అందించే ఏర్పాట్లు చేశారు.
శ్రీకాళహస్తిలో 53 మంది హస్తకళాకారులకు నేత్ర పరీక్షలతో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
ఇక మహోత్సవం సందర్భంగా తన ఆరోగ్య సమస్యను వివరించిన పసలదీవికి చెందిన లేస్ కళాకారిణి మహాలక్ష్మితో పాటు మరో కళాకారిణి అందే లక్ష్మిని ప్రత్యేకంగా శంకర నేత్రాలయానికి పంపించి పరీక్షలు చేయించారు. ఇద్దరికీ దృష్టి సమస్యలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించగా, కళ్లజోళ్లు, ఐ డ్రాప్స్, అవసరమైన మందులు అందజేశారు.