
రామచంద్రపురం: రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ చిత్త విజయ ప్రతాప్ రెడ్డి, కమిషన్ సభ్యులు జక్కంపూడి కిరణ్ ఆధ్వర్యంలో రెండో రోజు బుధవారం తనిఖీల పర్యటన కొనసాగింది. రామచంద్రపురం మండల పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాల, జడ్పీ హైస్కూల్, మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ తదితర ప్రాంతాలను కమిషన్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
పర్యటనలో భాగంగా వీరవెల్లిపాలెం అంగన్వాడీ కేంద్రం, తానే లంక గురుకుల పాఠశాల, పశువులంక అంగన్వాడీ కేంద్రం, జడ్పీ హైస్కూల్ను కమిషన్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్థులకు అందుతున్న పౌష్టికాహారం, భోజనం నాణ్యత, ఆహార పదార్థాల నిల్వలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
అనంతరం రామచంద్రపురం మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ను తనిఖీ చేసి సరుకుల నిల్వలు, పంపిణీ విధానం, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం రామచంద్రపురంలోని మరో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్, సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలు, చిన్నారులు, విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పౌష్టికాహారం నాణ్యత, సరుకుల పంపిణీ, నిల్వలు, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా చూడాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, బీసీ, ఎస్సీ గురుకుల వెల్ఫేర్ హాస్టళ్ల ఉన్నతాధికారులు, అంగన్వాడీ పీడీతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు, విద్యార్థులకు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న ఆహార భద్రత పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా నిరంతరం తనిఖీలు చేపడతామని కమిషన్ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.