
నరసాపురం: జనసేన పార్టీ కావలి నియోజకవర్గ మత్స్యకార నాయకులు రాష్ట్ర మత్స్యకార ఛైర్మన్ మరియు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ను నర్సాపూర్లో వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇంచార్జి అళహరి సుధాకర్ ఆదేశాల మేరకు, మత్స్యకార కార్యదర్శి కోడింగారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పక్క రాష్ట్రాలకు చెందిన హైస్పీడ్ పెద్ద బోట్లు ఆంధ్రప్రదేశ్ సముద్ర పరిధిలో అక్రమంగా ప్రవేశించి మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని నాయకులు వివరించారు. వలలు, చిన్న పడవలు ధ్వంసం అవుతూ జీవనోపాధి దెబ్బతింటోందని తెలిపారు. ఈ సమస్యను జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరారు.
వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన బొమ్మిడి నాయకర్, మే 9న తిరుపతిలో మత్స్యకార ప్రధాన నాయకులతో సమావేశం కావాలని సూచించారు. అలాగే సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార ప్రధాన కార్యదర్శి ఆకుల ప్రవీణ్ కుమార్, ప్రళయకావేరి రవి, వెంకయ్య బాబు, కొండూరు వెంకటేశ్వర్లు, చిన్నింగారి బాలు తదితరులు పాల్గొన్నారు. పక్క రాష్ట్రాల బోట్ల వల్ల మత్స్య సంపద దోపిడీతో పాటు భారీ ఆర్థిక నష్టం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.