
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక కాన్వాయ్లో ఉండే వాహనాల సంఖ్యను భారీగా తగ్గిస్తూ 12 వాహనాల స్థానంలో కేవలం 4 వాహనాలతోనే ప్రయాణించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చిన సీఎం, గురువారం నుంచి కొత్త విధానాన్ని ప్రారంభించారు.
ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు చంద్రబాబు నాలుగు వాహనాల కాన్వాయ్తోనే బయలుదేరారు. ఇకపై అన్ని అధికారిక పర్యటనలు, సమావేశాలకు కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, మంత్రులు మరియు ప్రజాప్రతినిధులు కూడా తమ కాన్వాయ్లలో అనవసర వాహనాలను తగ్గించుకోవాలని సూచించారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేయవచ్చని, ప్రభుత్వ వ్యవస్థలో పొదుపు సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నిర్ణయం తర్వాత పలువురు మంత్రులు కూడా తమ వాహన శ్రేణిని తగ్గించుకునేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు ఇంధన పొదుపుతో పాటు బాధ్యతాయుత పరిపాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.