
సర్వేపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ముత్తుకూరు మండలం నేలటూరుపాలెంలో పర్యటించారు. అక్కడ దిబ్బపై గత పది సంవత్సరాలుగా నివాసం ఉంటున్న గిరిజన కుటుంబాలను ఆయన కలుసుకుని వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గిరిజనులు తమ సమస్యలను వివరించారు. ప్రస్తుతం తమకు కరెంటు, తాగునీటి సౌకర్యాలు లేవని, సుమారు పది కుటుంబాలు ఇబ్బందుల్లో జీవిస్తున్నామని తెలిపారు. చిన్న పిల్లలు కూడా ఉన్నందున తక్షణ సహాయం అవసరమని వారు కోరారు. గ్రామం దగ్గరలో ఇల్లు ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఈ సమస్యలపై స్పందించిన సురేష్ నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో పేదలు, గిరిజనులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. రెండు మూడు రోజుల్లో తాము చేయగలిగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఈ సమస్యను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండల ప్రధాన కార్యదర్శి సంధులు శ్రీహరి పాల్గొన్నారు.