
రాజోలు: సఖినేటిపల్లి మండలం మోరి మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం వద్ద రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే ప్రక్రియ ద్వారా భూ రికార్డులను మరింత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందిస్తూ రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించిన రీ-సర్వే వల్ల భూముల సరిహద్దులపై ఉన్న సందిగ్ధత తొలగి, రైతులకు స్పష్టమైన భూ హక్కులు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు భూమి యాజమాన్యానికి విశ్వసనీయ ధ్రువపత్రాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. వీటి ద్వారా భూ వివాదాలు తగ్గడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు, ఇతర ప్రభుత్వ సేవలను రైతులు సులభంగా పొందే అవకాశం కలుగుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.