
విజయవాడ–మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతిపత్రాలను స్వీకరించి, వారి సమస్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమమే జనవాణి అని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
అందిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి, అర్జీలను పరిష్కారానికి పంపించినట్లు వెల్లడించారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే జనవాణి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, ప్రజా సంక్షేమమే జనసేన పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు.