
మార్కాపురం: పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేలా రూపొందించిన ‘మిషన్ మార్చి–2027’ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రతి ఉపాధ్యాయుడు సమర్థవంతంగా అమలు చేసి విజయవంతం చేయాలని డీసీఈబీ కార్యదర్శి, కోర్సు కోఆర్డినేటర్ ఎం. సుధాకర్ పిలుపునిచ్చారు.
మార్కాపురంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం రెండో రోజు 6వ నుంచి 8వ తరగతుల నూతన పాఠ్యపుస్తకాల బోధన విధానాలపై సబ్జెక్టుల వారీగా శిక్షణ నిర్వహించారు. జిల్లా విద్యాశాఖాధికారి సామా సుబ్బారావు కోర్సు డైరెక్టర్గా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
శిక్షణలో భాగంగా నూతనంగా ప్రవేశపెట్టిన కృత్రిమ మేధ (ఏఐ) అంశంపై రిసోర్స్ పర్సన్ ఎం. సజీవరాజు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అలాగే పాఠశాల నిర్వహణ, రిజిస్టర్ల నిర్వహణ, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు, పాఠ్య ప్రణాళికలు, ఉపాధ్యాయుల హ్యాండ్బుక్స్, ‘నో బ్యాగ్ డే’ నిర్వహణ, సైన్స్ ప్రయోగశాలలు, సైన్స్ కిట్ల వినియోగంపై రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్లు శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమంలో మండ్ల రామాంజనేయులు, డాక్టర్ మొర్రి పిచ్చయ్య, విప్లవ్ కుమార్, ప్రదీప్, వేణుగోపాల్, మణిరాజ్, ఆదినారాయణ, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.