
మార్కాపురం : మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి మొత్తం 212 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన 141 అర్జీలు, ఇతర శాఖలకు సంబంధించిన 71 అర్జీలు నమోదయ్యాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పీజీఆర్ఎస్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు తగిన శ్రద్ధ చూపడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు.
ఇప్పటి నుంచి జిల్లా స్థాయి అధికారులు ప్రతి బుధవారం, శుక్రవారం తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అలాగే ఐవీఆర్ఎస్ (IVRS) సర్వేలో కనీసం 80 శాతం ప్రజా సంతృప్తి సాధించేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. రీ-సర్వే, ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాలకు సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు వెంకట శివరాంరెడ్డి, అజయ్ కుమార్, జిల్లా మైనింగ్ అధికారి రవి ప్రసాద్, విద్యుత్ శాఖ ఎస్ఈ కరీం, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, వివిధ మండలాల తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.