
మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో మొత్తం 179 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించిన 101 అర్జీలు, ఇతర శాఖలకు సంబంధించిన 78 అర్జీలు ఉన్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు.
జిల్లాలో భూ సంబంధిత సమస్యలు అధికంగా ఉన్నందున రెవెన్యూ అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను ప్రాధాన్యతగా తీసుకుని చొరవతో పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు వెంకట శివరామిరెడ్డి, అజయ్ కుమార్, విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఖరీం, జిల్లా రవాణా శాఖ అధికారి రాంబాబు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శివన్నారాయణతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.