హర్మూజ్‌లో 60 రోజుల పాటు ఉచిత ప్రయాణం.. ఇరాన్ బంపర్ ఆఫర్!

అమెరికాతో కుదిరిన 14 సూత్రాల తాత్కాలిక అవగాహన ఒప్పందం అమలులో భాగంగా ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత ప్రాధాన్యం కలిగిన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే అన్ని అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు రాబోయే 60 రోజుల పాటు ట్రాన్సిట్ ఫీజులను పూర్తిగా మినహాయిస్తున్నట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. ఈ కాలంలో నౌకల రాకపోకలకు సంబంధించిన అనుబంధ వ్యయాలను కూడా ఇరాన్ ప్రభుత్వమే భరించనున్నట్లు తెలిపింది.

అయితే భద్రతా, పరిపాలనా కారణాల దృష్ట్యా ప్రతి నౌక పర్షియన్ గల్ఫ్ జలసంధి అథారిటీ నుంచి ముందస్తు అనుమతి పొందాలని, కేటాయించిన మార్గాల్లోనే ప్రయాణించాలని స్పష్టం చేసింది. ఈ ఒప్పందానికి అనుగుణంగా అమెరికా రక్షణ విభాగం కూడా ఇరాన్ ఓడరేవులపై అమలులో ఉన్న నౌకాదళ దిగ్బంధనాన్ని నిలిపివేసింది. దీంతో అంతర్జాతీయ నౌకల రాకపోకలు సులభతరమయ్యాయి.

హర్మూజ్ జలసంధి ద్వారా ముడి చమురు రవాణా మళ్లీ పుంజుకోవడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దెబ్బతిన్న వాణిజ్య రంగానికి ఈ నిర్ణయం ఊరటనిచ్చే అవకాశముంది. అనుమతుల మంజూరు ప్రక్రియను కూడా ఇరాన్ వేగవంతం చేసింది.

అయితే 60 రోజుల గడువు అనంతరం పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపై అమెరికా, ఇరాన్ మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో శాశ్వత ఉచిత రవాణా ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడుతుండగా, ఇరాన్ మాత్రం ఆ గడువు తర్వాత పర్యావరణ, రవాణా సేవల పేరిట మళ్లీ ఫీజులు విధించే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తోంది. అణు కార్యక్రమాలు, ఆర్థిక ఆంక్షలు, రవాణా ఫీజుల అంశాలపై భవిష్యత్ దౌత్య చర్చల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.