
- కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు హాజరు
- ఘన స్వాగతం పలికిన ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు
- అనంతరం భారీ బైక్ ర్యాలీ
ఏలూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఏలూరులో నిర్వహిస్తున్న విజయోత్సవ సభలో పాల్గొనేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు బైపాస్ వద్ద ఉన్న ఎస్వీఆర్ విగ్రహం సమీపంలో ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు నేతృత్వంలో ఆయనకు గజమాలలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం జనసేన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఏలూరు నగరంలోని పలు ప్రాంతాల మీదుగా సాగి కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఇండోర్ స్టేడియం వద్దకు చేరుకుంది.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు సమర్థవంతంగా వివరించడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు), ఉంగుటూరు ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు, చింతలపూడి జనసేన ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య, నూజివీడు జనసేన ఇన్ఛార్జి బర్మా ఫణిబాబు, ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుగ నాగరాజు, ఏపీఐఐసీ బోర్డు సభ్యుడు చెన్నమళ్ల చంద్రశేఖర్, కైకలూరు నాయకుడు కొల్లు బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏలూరు జిల్లాకు చెందిన పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, కూటమి పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.