
వనపర్తి : జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ నాయకుడు, వనపర్తి జిల్లా కోఆర్డినేటర్ ముకుంద నాయుడు తెలిపారు.
వనపర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉన్నప్పటికీ, వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. జరిగిన విషయాలకు వాస్తవాలకు మించి ఊహాగానాలు జోడించి ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్పై వచ్చిన వివాదాల్లో జనసేన పార్టీ అధికారికంగా ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, కొందరు అభిమానులు లేదా నాయకులు వ్యక్తిగతంగా స్పందించి ఫిర్యాదులు చేసిన సందర్భాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అనంతరం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు వాటిని విరమించుకోవాలని కూడా చెప్పినట్లు పేర్కొన్నారు.
ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు పరస్పర గౌరవాన్ని పాటించాలని, రాజకీయ విమర్శలు వ్యక్తిగత స్థాయికి వెళ్లకూడదని ముకుంద నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సోదరభావం కొనసాగాలని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని ఆయన కోరారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ పరస్పర గౌరవం, సంయమనం పాటించడం ప్రజాస్వామ్యానికి అవసరమని అన్నారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజాసేవ, సామాజిక సమగ్రత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై ఆధారపడి ఉన్నాయని ముకుంద నాయుడు పేర్కొన్నారు.