
ప్రకాశం జిల్లా : మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా గురువారం ఉదయం ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ మరియు పోలీసు అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత అని కొనియాడారు. కళారంగంలో తన అసాధారణ ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని, అనేక తరాలకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ పోషించిన పాత్రలు న్యాయం, ధర్మం, పరోపకారం వంటి విలువలను ప్రజల్లో నాటాయని, ఆయన నటన తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. రాజకీయ రంగంలో ప్రవేశించి ప్రజాసేవకు అంకితమై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు.
తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన నాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆర్ఐ సీతారామిరెడ్డి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు.