
జీవ నదులను మన చేతులారా చంపేస్తున్నాం
• నదులను మృత నదులుగా మారిస్తే భవిష్యత్తు ఉండదు
• గోదావరి కాలుష్య నివారణకు అంతర్ శాఖల (జిల్లా) టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
• రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు
• ఆరు నెలల్లో నదిలో మార్పు కనిపించాలి
• హడావుడి పనులతో భక్తుల ప్రాణాలతో చెలగాటమొద్దు
• పుష్కరాల ఏర్పాట్లలో 6 జిల్లాల పంచాయతీలను భాగస్వామ్యం చేయండి
• దేశం గర్వపడేలా ప్లాస్టిక్ రహిత పుష్కరాలు నిర్వహిద్దాం
• గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్ష సమావేశం
‘మన దాహం తీర్చి, మనకు జీవితాన్ని ఇచ్చే పవిత్రమైన జీవ నదులను మనమే చేతులారా చంపేస్తూ, వాటిని మృత నదులుగా మారుస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. నదుల పట్ల మనకున్న నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు తాగు నీరు దొరకడమే చాలా కష్టమవుతుందని హెచ్చరించారు. భగవంతుడు ప్రసాదించిన నీటిని ఇష్టారాజ్యంగా కలుషితం చేస్తూ, మళ్లీ అదే తాగునీటి కోసం జలజీవన్ మిషన్ అంటూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విచిత్ర పరిస్థితికి స్వస్తి చెప్పాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని కాలుష్యాన్ని నివారించడానికి ప్రత్యేకంగా అంతర్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారాలను సూచించే విధంగా ఈ టాస్క్ ఫోర్స్ పని చేయాలని సూచించారు. టాస్క్ ఫోర్స్ ఇచ్చే నివేదికలు, సూచనలు క్షేత్ర స్థాయిలో వేగంగా అమలు జరిగేలా పర్యవేక్షణ కమిటీ ఉండాలని స్పష్టం చేశారు. నదుల రక్షణకు ఇవాళ్టి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని, వచ్చే ఆరు నెలల్లో నదుల్లో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆదేశించారు. సోమవారం ఉదయం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై పీసీబీ, అటవీ-పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిoచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “మనం తాగే పవిత్రమైన గోదావరి నీటిలోనే, మన ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిని వదిలేస్తూ నదిని తీవ్రంగా అపవిత్రం చేస్తున్నాం. నది ఎక్కడెక్కడ కలుషితమవుతోంది, ఏయే కాలువలు, ఉపనదులు వ్యర్థాలను మోసుకొచ్చి నదిలో కలుస్తున్నాయి అనే విషయాలపై తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరపాలి. నది తీవ్రంగా కలుషితమవుతున్న ప్రధాన కేంద్రాలను గుర్తించి, అక్కడ తక్షణమే ‘పొల్యూషన్ ఆడిట్’ నిర్వహించాలి. నదిలోకి మురుగు నీరు, రసాయనాలు చేరుతున్న కీలక ప్రాంతాల నుంచి నీటి నమూనాలను సేకరించి ల్యాబొరేటరీ పరీక్షలకు పంపాలి. నదీ తీరాలను, మన జీవ నదులను కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలకు మనుగడే ఉండదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మిషన్ ఫర్ క్లీన్ గోదావరి’ వంటి పథకాలు కేవలం ఆర్బాటాలకే పరిమితమయ్యాయి అనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో సరైన విధానం లేకపోవడం వల్లే ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు.
మిషన్ ఫర్ క్లీన్ గోదావరి బోర్డులకే పరిమితం కారాదు
పుష్కరాలు దగ్గరకు వచ్చాక హడావుడిగా టెండర్లు పిలిచి, నాణ్యత లేకుండా తాత్కాలికంగా ఘాట్లు, కట్టడాలు కడితే… అవి కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో అలాంటి సంఘటనలు చూశాం. అలాంటి దారుణమైన బ్రాండ్ మన ఆంధ్రప్రదేశ్కు వద్దు. ముహూర్తం దగ్గరపడ్డాక కంగారుపడటం కాదు… ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా, మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో పనులు చేయాలి. భక్తులు ఎంతో పవిత్ర భావంతో పుష్కర స్నానానికి వస్తారు. ఘాట్లకు వచ్చి వెళ్లాక.. మేము మురికి నీళ్లలో స్నానం చేసి వెళ్లాం అనే మాట ఎవరి నోటి వెంబడైనా వస్తే అది మన ప్రభుత్వానికే అవమానం. అందుకే మిషన్ ఫర్ క్లీన్ గోదావరి కేవలం బోర్డులకే పరిమితం కాకూడదు. గోదావరి నదుల్లోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు కలవకుండా పటిష్టమైన దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేయాలి.
గోదావరి పుష్కరాలు అంటే కేవలం రాజమండ్రే అనే భావన నుంచి బయటకు వచ్చి… గోదావరి ప్రవహిస్తున్న ఆరు జిల్లాలకు సంబంధించిన అన్ని పంచాయతీలను భాగస్వాములు చేయాలి. గత పుష్కరాలకు 4.6 కోట్ల మంది భక్తులు వస్తే, ఈసారి ఆ రద్దీ రెట్టింపై దాదాపు 10 కోట్ల మంది వస్తారని అంచనా ఉంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు ఉండాలి.
ప్లాస్టిక్ రహిత పుష్కరాలను నిర్వహిద్దాం
జీవ నదులను కాపాడుకోవడానికి విప్లవాత్మక నిర్ణయాలు అవసరం. గోదావరి పుష్కరాలను దేశం మొత్తం మన వైపు తిరిగి చూసేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవనదులను ఎంత పవిత్రంగా, పర్యావరణ హితంగా కాపాడుకుంటుందో దేశం మొత్తానికి తెలియాలి. ఒక్క రాజమండ్రిలోనే కాకుండా గోదావరి ప్రవహించే ఆరు జిల్లాలలో ఏడాదిపాటు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. పుష్కరాల నాటికి నదీ తీరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నదే కనిపించకూడదు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఎన్విరాన్మెంటల్ టాస్క్ఫోర్స్ రాబోయే ఏడాది కాలంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించేలా, దానికి తగిన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెచ్చేలా కఠినమైన చర్యలు చేపట్టాలి.
కాలుష్య నియంత్రణ చర్యలకు రూ.100 కోట్లు బడ్జెట్
గోదావరి ప్రవహించే ఆరు జిల్లాల పరిధిలో కాలుష్య నియంత్రణ చర్యల కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా రూ.100 కోట్ల ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తున్నాం. కాలుష్యాన్ని అరికట్టడానికి పీసీబీ ఆధ్వర్యంలో ఒక పటిష్టమైన అంతర్ శాఖల (జిల్లా) టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. ఈ ఆరు జిల్లాలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఇందులో భాగస్వాములుగా ఉంటూ కలిసి పనిచేస్తారు. కొన్ని పరిశ్రమలకు సంబంధించిన రసాయన వ్యర్థాలు నేరుగా గోదావరి నదీపాయల్లో కలుస్తున్నాయని, దీనిపై ఈ టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా నిఘా పెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది.
పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో గోదావరి తీర గ్రామాల్లోనూ పుష్కర ఘాట్లు
రాబోయే గోదావరి పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ భారీ రద్దీని తట్టుకోవడానికి పుష్కర ఏర్పాట్లను కేవలం రాజమహేంద్రవరంతోపాటు గోదావరి పరిసర గ్రామాల్లోని ఘాట్లను కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. గోదావరి ప్రవహించే ఆరు జిల్లాల పరిధిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన 285 గ్రామ పంచాయతీలను అధికారులు గుర్తించారు. ఈ గ్రామాల్లోని పుష్కర ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఆయా పంచాయతీలకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల వసతి కోసం గ్రామాల్లోని ఇళ్లలోనే ‘హోం స్టే’ సౌకర్యాలను కల్పిస్తాం. పుష్కరాల పనులు, పర్యాటకుల రాక వల్ల స్థానిక ప్రజలకు ఉపాధి దొరికి, గ్రామాలు ఆర్థికంగా ఎంతో బలోపేతం అవుతాయి.
ప్లాస్టిక్ ఫ్రీ గోదావరిలో భాగస్వాములు కావాలి
గోదావరి నదీ పాయల్లో చూస్తే కాలుష్యంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నివారణా చర్యల్లో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ రాజమండ్రి పేరిట అవగాహనా కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ప్రజలంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. జీవ నది మన తల్లి లాంటిది. దాన్ని కలుషితం చేస్తే మనకు భవిష్యత్తుని మనమే పాడుచేసుకున్న వారం అవుతాం. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు కూడా ప్లాస్టిక్ ఫ్రీ నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. గోదావరి నది కాలుష్యం బారినపడకుండా చూడాల్సిన బాధ్యతను మరోసారి అందిరికీ తెలియజేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కృష్ణా, గోదావరి నదులను శుభ్ర పరిచే బాధ్యత తీసుకుంటాం. జీవ నదులు కాలుష్యం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. పుష్కరాలు వచ్చే వరకు ప్రతి రెండు వారాలకు ఒకసారి కాలుష్యంతోపాటు, అభివృద్ధి పనులపైనా సమీక్ష నిర్వహిస్తామ”న్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్, శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ శ్రీ బత్తుల బలరామకృష్ణ శ్రీ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు, శాసన మండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, పంచాయతీ రాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.