
అమలాపురం ఆర్టీసీ డిపో నుంచి టిడ్కో గృహాల వరకు గతంలో ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటలకు రెండు ప్రత్యేక బస్సు ట్రిప్పులు నడిపేవారు. అయితే ఇటీవల ఈ సర్వీస్ విధానంలో మార్పులు చేసి, ఉదయం 8 గంటలకు ఆదుర్రు నుంచి అమలాపురం వయా టిడ్కోగా, సాయంత్రం 5 గంటలకు అమలాపురం నుంచి ఆదుర్రు వయా టిడ్కోగా బస్సు నడుపుతున్నారు.
ఈ మార్పుల కారణంగా టిడ్కో వాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ వినియోగదారుల సంఘం ప్రధాన కార్యదర్శి, జర్నలిస్ట్ జి.ఎన్. రావు (పండుబాబు) ఈ నెల 4వ తేదీన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం సమర్పించారు.
దీనిపై స్పందించిన అమలాపురం ఆర్టీసీ డిపో అధికారులు, ఈ నెల 16వ తేదీ శనివారం సమాధానం అందజేశారు. అదనపు బస్సులు అందుబాటులోకి వచ్చిన తర్వాత టిడ్కో ప్రాంతానికి ప్రత్యేక ట్రిప్పులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రస్తుతం నడుస్తున్న బస్సులో టిడ్కో ప్రయాణికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత డ్రైవర్లకు సూచనలు చేసినట్లు, అలాగే నోటీస్ బోర్డు ద్వారా సిబ్బందికి సమాచారం అందించినట్లు అధికారులు వెల్లడించారు.