
మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని డిప్యూటీ సీఎంఓ ఎక్స్ వేదికగా వెల్లడించింది. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ దూసుకుపోతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను సులభతరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో శ్రీ నాని గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ స్వచ్చరథాలు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేయడం ద్వారా రూ. 3.32 కోట్ల విలువగల నిత్యవసరాలను ప్రజలకి అందించాయని చెప్పేందుకు ఆనందిస్తున్నాం. గ్రామాల్లో పారిశుధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో పెంపొందుతున్న అవగాహనకు ఇది నిదర్శనం. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం ఈ స్వచ్ఛరథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు మరియు స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తోంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి “స్వచ్ఛ భారత్” మరియు “స్వచ్చఆంధ్ర” లక్ష్యాలను సాధించేందుకు ఈ స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించుట జరిగినదని డిప్యూటీ సీఎంఓ వివరించింది.