
• ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ చొరవతో పెరిగిన హోదా
• అందుబాటులోకి అదనపు సిబ్బంది
పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కో అడుగు వడివడిగా వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ క్రమంలో గొల్లప్రోలు నగర పంచాయతీని గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయించారు. మున్సిపాలిటీ హోదాతో గొల్లప్రోలు ప్రాంత అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఏర్పడనున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ ద్వారా పట్టణ పరిధిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతుంది. గ్రూప్ 2 స్థాయి అధికారి మున్సిపల్ కమిషనర్ గా వస్తారు. మరింత మంది అదనపు సిబ్బంది అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే వీలు కలుగుతుంది. మున్సిపల్ హోదా పెరిగినా ప్రజలపై ఎలాంటి అదనపు భారం ఉండదు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.