
తాడేపల్లిగూడెం : రైతుల సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన బాధ్యత అని ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ సిద్ధ వీర్రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులు ఎదుర్కొనే ప్రతి సమస్యను పరిష్కరించి వారికి అవసరమైన సహకారం అందించడం సహకార సంఘాల బాధ్యత అని చెప్పారు. తాడేపల్లిగూడెం సహకార సంఘం 34 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా రైతులకు ఎరువుల విక్రయాలను ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు.
బీజేపీ ఇన్చార్జి ఈతకోట తాతాజీ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు, విత్తనాలు తదితర వ్యవసాయ ఇన్పుట్లను సహకార సంఘాల ద్వారా అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువులపై భారీ సబ్సిడీ అందిస్తూ వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తున్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెం సహకార సంఘంలో ఎరువుల విక్రయాలు ప్రారంభం కావడంతో పరిసర ప్రాంతాల రైతులు అవసరమైన ఎరువులను స్థానికంగానే సులభంగా పొందే అవకాశం కలుగుతుందని, ఇది రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.