
తుని: ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని తుని నియోజకవర్గంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తుని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న శ్రీ 7వారాల వేంకటేశ్వర స్వామి ఆలయంలో, అలాగే డీమార్ట్ సమీపంలోని శ్రీ సత్తెమ్మ తల్లి ఆలయంలో పవన్ కళ్యాణ్ గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన వీర మహిళ శ్రావణి సాయి ఆధ్వర్యంలో నిర్వహించారు.
శ్రావణి సాయి చెప్పులు లేకుండా కాలినడకన రెండు ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించి, సత్తెమ్మ తల్లికి పసుపు, కుంకుమలు సమర్పించి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం అందరికీ ముఖ్యమని తెలిపారు. వైద్యుల సూచనలు పాటిస్తూ ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుని ప్రజాసేవలో తిరిగి చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స వార్తతో రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణులు ఆందోళన చెందగా, ఆయన ఆరోగ్యానికి వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.